Tuesday 16 July 2013

అందరూ మనుషులే..!





రోజు లాగే ఆ రోజు కూడా రజని ఉదయాన్నే లేచి పిల్లలకు పాలిచ్చి, స్కూలుకు రడీ చేస్తుండగా, పలు ఊళ్ళు తిరిగే ఉద్యోగి  అయిన తన భర్తకి అర్జంటుగా పక్కఊరు రావాలని ఫోను వచ్చింది.  నేను వచ్చేసరికి బాగా పొద్దుపోతుంది, జాగ్రత్త..  అని చెప్పి రెడీ అయ్యి బయలుదేరుతున్నాడు.  ఈలోగా, విధవరాలైన వాళ్ళ పనిమనిషి కాంతం ఎదురొస్తుంది. మడి,ఆచారాలు బాగా పాటించే రజనీ, తన భర్తని ఇంట్లోకి లాక్కొని వస్తూ, "ఏమే కాంతం విధవరాలివి కదా, అలా ఎదురురాకపొతే కాసేపు పక్కన ఉండవచ్చు కదా, వెధవ శకునం, వెధవ శకునం" అని తిట్టి, తన భర్తని మంచి నీళ్ళు తాగి వెళ్ళండి అని విసుక్కొంది. "నువ్వూ.. నీ చాదస్తం" అని భర్త విసుక్కొని నీళ్ళు తాగి వెళ్ళాడు.

వర్షాకాలం కావడంతో, జోరుగా వర్షం మొదలైంది. పిల్లల్ని స్కూలునుండి ఇంటికి తీసుకొచ్చే సమయం అవ్వడంతో, స్కూలుకి బయలుదేరింది రజని. దారిలో వర్షం బాగా పెరగడంతో,ఒక పక్కన ఆగింది.

స్కూలుకు దగ్గర్లోనే పనమ్మాయి ఇల్లు కావడంతో, ఎలాగో ఇప్పుడు కాంతం ఆంటీ మా ఇంటికి వెళ్తుంది కదా, పోనీ, వాళ్ళ ఇంటికి వెళ్ళి కాంతం ఆంటీతో కలసి మా ఇంటికి వెళ్తాను అని అనుకొంటూ పాప పనిమనిషి కాంతం ఇంటికి వెళ్ళింది. అప్పుడు కాంతం, "బాగా వర్షం పడుతుంది కదమ్మా.. కాసేపాగి వెళ్దామా?" అని అంది. పాప సరే..  అని "మరి నాకు ఆకలేస్తోంది" అని అంది. అప్పుడు కాంతం, "అయ్యబాబోయ్ మేమేదైనా నీకు పెడితే మీ అమ్మ ఊరుకుంటుందా?," అని అంది. ఇంతలో, పాప కాంతం ఇంటికి వెళ్ళిందని, స్కూలు గేట్ మేన్ ద్వారా తెలుసుకొన్న రజనీ, కాంతం ఇంటికి వెళ్ళింది. మడి,ఆచారాలు మంట కలిపిందని పాపని తిట్టి, ఇంటికి తీసుకెళ్ళిపోయింది.

వర్షంలో తడచిన పాపకి బాగా జలుబు చేసి, జ్వరం వచ్చింది. భర్త వచ్చాక ఆసుపత్రికి తీసుకువెళ్దాం అనుకొన్న రజనికీ, "భర్తకి పని అవ్వలేదు, రేపు బయలుదేరతాడు" అని భర్త నుండి ఫోను వచ్చింది. పాపకి జ్వరం బాగా పెరిగిపోతోంది, పోనీ తను తీసుకెళ్దాం అంటే కుండపోతు వర్షం. "అయ్యో దేవుడా.. ఏం చెయ్యను?" అని ఏడుస్తుండగా, అంట్లు తోమడానికని వచ్చిన కాంతం, రజనీ ఏడవడం గమనించి, "ఏందమ్మా అట్టా ఉన్నారు?" అని అడిగింది.
ఇంక తన మడి గిడి అన్ని వదిలేసి గబ గబా కాంతాన్ని పట్టుకొని ఏడుస్తూ, "పాపకు బాగా ఒళ్ళు కాలిపొతుందే.. సమయానికి అయ్యగారు కూడా ఊర్లో లేరు, నాకు ఏంచెయ్యాలో తెలియట్లేదే" అని అంది. అది విని వెంటనే  కాంతం, "నేను ఒక డాటరమ్మగారింట్లో పని సేత్తానండి. ఆవిడ సెయ్యి చాలా మంచిది, అక్కడికి తీసుకు వెల్దామా?" అని అడిగింది. బాగా వర్షం పడ్తుంది కదే అని అంది రజని. "అదంతా మీకెందుకండి? నే తీసుకెళ్తాగా !" అని అంది.

ఆ వర్షం లోనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక రిక్షాని తీసుకొచ్చి, ఆ రిక్షాలో పాపని,తల్లిని ఎక్కిచుకొని ,డాక్టరమ్మ దగ్గరకి తీసుకెళ్ళి  వైద్యం చేయించి, మందు బిళ్ళలు తీసుకొచ్చి, మళ్ళీ అదే రిక్షాలో ఇంటికి తీసుకొచ్చి దించి, "ఇక తగ్గిపోద్దిలెమ్మ,భయపడకు...  ఇక నేను వత్తానమ్మ పిల్ల ఒక్కర్తే ఉందీ.. ఎలాఉందో ఏటోనమ్మ?" అని వెళ్లబోతుంటే, రజని ఆపి, " పోనీ మీ అమ్మాయిని కూడా తీసుకొని ఇక్కడికి వచ్చైవే ఎలాగో అయ్యగారు కూడా లేరు కదా..!" అని అంది. "మరి మీకు మడీ అవి ఉన్నవి కదమ్మ.." అని అడిగింది కాంతం.

"మనిషి కన్నా మడి,ఆచారాలు గొప్పవి కాదని తెలియ చేసాడే దేవుడు..!" అని చెయ్యి పట్టుకొని కన్నీరు కార్చింది రజని.

"మనిషిని మనిషిగా చూడటం...  ఒక మనిషిగా, ప్రతి మనిషిలో ఉండవలసిన మొదటి లక్షణం..!".






      

No comments:

Post a Comment