Monday 12 May 2014

ఒక తల్లి కథ


ఒక పదహారేళ్ళ అమ్మాయి.. ఆడుతూ పాడుతూ ఎన్నో కలలతో, కొత్త ఆశలతో హాయిగా పొలాల గట్లపైన పరుగులుతీస్తూ, పక్షులతో మురిపెంగా మాటలాడుతూ, పిల్లలతో కేరింతలు కొడుతూ తన అందమైన ప్రపంచంలో తనే మహారాణిగా జీవించేది. ఇంట్లో ఉన్నప్పుడు అణకువగా అమ్మకు సహాయం చేస్తూ ఒక సేవకురాలిగా ఉండేది. ఆమె పేరు దుర్గ. కొంచం కొంచంగా విద్యాబుద్ధులు కూడా నేర్చుకుంది. దుర్గలో ఉన్న సుగుణం ఆమె సహనం. రెండేళ్ళు గడిచాక, దుర్గకు వివాహమైంది. 




పుట్టింట్లో ఎంత అల్లరి, అణకువో.. అత్తింట్లో అంతే అణకువ, సహనం. ఆ ఇంటికి వచ్చిన కోడలిగా కొత్త బాధ్యతను ఎత్తుకుంది. ఉదయం నుంచి, రాత్రి వరకు అందరినీ చూసుకుంటూ, అన్ని పనులూ చేసుకుంటూ, ఆ ఇంటికి తానొక మహారాణిలా బాధ్యతగా మసలుకుంది. అవసరమైతే సేవకురాలయ్యింది. భర్తకు తానొక ఊతమయ్యింది. అత్తమామలకు మంచి మనసుతో సేవలు చేసింది. కొన్నాళ్ళకి తాను నోచిన నోముల ఫలంగా ఒక మగబిడ్డకు తల్లి అయ్యింది. ఆమె గౌరవం, బాధ్యత రెట్టింపు అయ్యింది. పొత్తిళ్ళలో తన బిడ్డను చూసుకుని మురిసిపోయింది. పెద్ద పండగలా ఊరివారందరికీ భోజనాలు వడ్డించింది. వచ్చినవారందరూ తనబిడ్డను దీవిస్తూ ఉంటే ఎన్నో ఆనంద భాష్పాలను రాల్చింది. ఆ బిడ్డను చూసుకుని తనివితీరా మురిసిపోయింది. బిడ్డ పెరిగి పెద్దవాడవుతూ ఉంటే, అతడి ఉన్నతిని చూసి ఉప్పొంగిపోయింది. దుర్గ ఇప్పుడు అమ్మ అయ్యింది. తన కొడుకు వేసే ప్రతీ అడుగుని గమనిస్తూ, తడబడితే ఊతమిస్తూ, తప్పటడుగులు వేస్తే సరిచేస్తూ నీడలా కంటికి రెప్పలా కాపాడుకుంది. తన కొడుకు పెద్దవాడై డాక్టరు అయ్యాడని ఊరంతా గర్వంగా చెప్పుకుంది. 


కానీ, అంతలోనే విషాదం. దుర్గమ్మ భర్త మరణం. అత్తమామలు ఎప్పుడో కాలం చేశారు, ఇప్పుడు భర్త కూడా వీడిపోయినా, తన బిడ్డ ఉన్నాడనే ధైర్యంతో ప్రాణాలు బిగబట్టుకుని బ్రతికేస్తోంది.
కొన్నాళ్లకు తన కొడుకు కోరుకున్న అమ్మాయితోనే వివాహం జరిపించింది. ఊరిలో ఉండటం కుదరదని చెప్పి, కొడుకు దుర్గమ్మని సిటీకి తీసుకు వచ్చాడు. అక్కడ అంతా కొత్త. ఆమెకు ఊరు తప్ప, పట్నం పెద్దగా పరిచయం లేనిది. కొడుకు ఇంట్లో వేరే ఒక గదిని ఇచ్చారు దుర్గమ్మకి. కొడుకు డాక్టరు కావటం చేత బాగానే సంపాదన ఉండటం చేత, ఇంట్లో ముగ్గురు పనిమనుషులు ఉండేవారు. అన్ని పనులూ వారే చూసుకునేవారు. వారిలో ఒక పనిపిల్ల లక్ష్మి. ఆ పిల్లకి పదిహేనేళ్ళు ఉంటాయి. దుర్గమ్మకి రోజులో ఎక్కువ కాలక్షేపం లక్ష్మితోనే. తన కొడుకుని రోజుకి ఒకసారైనా చూసుకోవాలనుకున్నా అతనికి వీలుపడక, ఏ మూడురోజులకో అలా కనపడేవాడు. అది కూడా కొంచం ఇబ్బందిగా దుర్గమ్మను కసురుకునే వాడు. పని వల్ల అలసి ఉన్నాడులే అని దుర్గమ్మ అనుకునేది. కొన్నాళ్ళకు కలిగిన మనుమడితో కొంత కాలక్షేపం దొరికింది దుర్గమ్మకి. కానీ, మళ్ళీ బాధ. కొడుకు తన కుటుంబంతో కలిసి అమెరికాకు వెళ్ళిపోదామనుకున్నాడు. ఆ తల్లి మనసు ఎంతగానో బాధపడింది. వద్దని వారించలేక, వాడి అభివృద్ధి కోసమే కదా అని సర్దుకుంది. వాళ్ళు విదేశానికి వెళ్ళిపోయారు. దుర్గమ్మను వేరే ఒక చిన్న ఇంట్లో ఉంచారు. నెల నెలా కొంత డబ్బు పంపేవారు. కొంతకాలమయ్యాక కొడుకుకి అక్కడి విలాసాలు బాగా అలవాటై, ఇక్కడ ఉన్న తల్లిని మరిచాడు. డబ్బు పంపటం భారంగా భావించాడు. డబ్బు లేక కాదు, సమయం వృధా అనుకుని. కొడుకు పంపే డబ్బు కన్నా అతడి ఉన్నతినే ఎప్పుడూ కోరుకున్నది దుర్గమ్మ. డబ్బులు లేవని ఆ ఇంటివారు దుర్గమ్మను బైటికి పంపేశారు. తన ఊరికి వెళదామన్నా అక్కడి ఇంటిని కొడుకు పెళ్ళి కోసం అమ్మేసింది. అక్కడ ఏదీ మిగిలిలేదు. దారిలేక, వెళ్ళి ఒక గుడిలో తలదాచుకుంది. గుడిలో ఊరికెనే ఉంటే బాగుండదని గుడిమెట్లు కడుగుతూ, ఊడుస్తూ బ్రతికింది. కొన్నాళ్ళకి అనారోగ్యం పాలు అయ్యింది. పాపం దుర్గమ్మను చూసిన వారే లేరు. పైగా గుడినుంచి అక్కడవారు ఆమెను బైటికి పంపేశారు. రోడ్డుపైన తిండిలేక, చూసే దిక్కులేక
వారం రోజులు అలాగే పడి ఉన్నది దుర్గమ్మ. 

ఒకసారి అటువైపుగా వచ్చిన లక్ష్మి, దుర్గమ్మను చూసి గుర్తుపట్టి తనతో తీసుకెళ్ళి కొన్ని మంచినీళ్ళు తాగించి, అన్నం కలిపి తినిపించింది. కొంత మేలుకున్న దుర్గమ్మ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. చల్లగా ఉండు తల్లీ అని లక్ష్మి తలపై చేయిపెట్టి అలాగే చనిపోయింది దుర్గమ్మ. దుర్గమ్మ స్థితిని చూసిన లక్ష్మి ఏడుపు ఆపుకోలేకపోయింది. అంత బాధనూ గుండెల్లో దాచుకుని, మనసులో కూడా కొడుకుని తిట్టుకోలేదు దుర్గమ్మ. తల్లికున్న గుండెలోని మమకారమే అది. ఒకప్పుడు గట్ల మీద హాయిగా ఆడుకున్న అమ్మి, గొప్పింటి కోడలిగా వెలిగిన ఇల్లాలు,.. ఈ పూట తన పేగుతెంచుకు పెట్టిన కొడుకు ఘనతవలన ఈ స్థితికి వచ్చింది. ఎందరో సుపుత్రులు ఈకాలంలో తల్లులకు మిగులుస్తున్న బాధల్లో దుర్గమ్మ కథ ఒకటి. ఇలాగే ఆ బరువుని మోస్తూ, రోడ్డున పడి రోదిస్తున్న తల్లి గుండెలు ఎన్నో ఉన్నాయి ఈ కాసుల ప్రపంచంలో. 


దయచేసి జన్మనిచ్చిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో రోడ్డున పడేలా చేయొద్దని ప్రతి తల్లి తరపునా ఒక మనవి. 



Friday 25 April 2014

అమ్మవారు...

"అబ్బబ్బబ్బబ్బ.. ఈ పనితో ఛస్తున్నాను, ఈ గుడి మొత్తం ఊడ్చి ఊడ్చి నడుం పడిపోయేలా ఉంది. అమ్మా ! అమ్మోరు తల్లీ.! నీకే ? హాయిగా బొమ్మలా కూర్చుని ఉంటావు, నా పనే ఇలా గగనమైపోయింది.." అని తిట్టుకుంటూ, వంగుతూ, లేస్తూ గుడి శుభ్రం చేస్తూ ఉంది తాయారు. పనిలో చేరి నెల రోజులైనా, ఈ తిట్లు మానదు. రోజూ ఇలాగే కసురుకుంటూ పని పూర్తి చేసుకునేది.

ఇదంతా చూసి చూసి, ఒకరోజు అమ్మవారే పలికింది, "తాయారు.. అసలు ఏమిటి నీ బాధ?" అని. తాయారుకి ఎవరు మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. అమ్మవారు స్వయంగా చెప్పింది , "నేనే.. " అని. ఓహో.. అమ్మోరు తల్లేనా మాట్లాడేది, "నీకు తెల్సు కదమ్మా, ఒకప్పుడు ఎంత బాగా బ్రతికినదాన్నో.. ఇప్పుడిలా ఊడ్చి తుడిచి బ్రతకాలంటే ఎంత కష్టంగా ఉందో నాకు, నిన్ను నమ్మాను అయినా ఈరోజు చూపించావు.. " అని అంది.

"సరే.. అయితే, ఇవాల్టికి నీకో వరం ఇస్తాను, నువ్వు నా స్థానం లో అమ్మోరిలా కూర్చో, నేను నీ స్థానంలో పని చేస్తాను" అని అమ్మవారు అంది. సరే అంది సంబరంగా తాయారు. "కానీ, తాయారు, రకరకాల భక్తులు వస్తూ ఉంటారు, నువ్వు ఓపిగ్గా వింటూ, ఏమి మాట్లాడకుండా జాగ్రతగా చూసుకో మరి.." అని చెప్పి అమ్మవారు, తన శక్తి తో తాయారుని తన స్థానంలో కూర్చోబెట్టి, తను మనిషిగా మారింది.   

ఈలోగా, ఒక రాజకీయ నాయకుడొచ్చాడు, "అమ్మా! నీ దయ వల్ల మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాను, తల్లీ.. ఇదిగో నా కానుక.." అని సమర్పించుకుంటూ ఉండగా, లక్ష రూపాయలున్న పర్సు కింద పడిపోయింది. అతను వెళ్లి గుడి ముందు ఆగాడు. వెంటనే, ఒక రైతు వచ్చాడు, "అమ్మా! నిన్ను నమ్ముకుని పంటేసాను, అంతా పోయింది, ఇంక నేను బ్రతకను తల్లీ.. " అని అంటూ ఉండగా, ఆ పర్సు కనపడింది, "అమ్మా.. నాకోసం ఇది నీ దయే నా తల్లీ.. " అని కళ్ళకద్దుకుని వెళ్ళిపోయాడు. తరువాత ఒక మిలిటరీ సైనికుడొచ్చాడు, "తల్లీ, ఈరోజే బోర్డరుకి వెళ్తున్నాను, దీవించు.. " అంటూ అతను దండం పెట్టుకునే లోపే, పోలీసులు వచ్చి అతణ్ణి, "పర్సు కొట్టేసిన దొంగ" అని అంటున్నారు. చాలా సేపు గొడవ అయ్యాక, ఇంక ఉండలేక అంతా చూసిన తాయారు, తాను అమ్మవారి స్థానంలో ఉన్నానని మరచి, "అయ్యో !.. దొంగ అతను కాదు, రైతు అని చెప్పింది.", పోలీసులు సైనికుణ్ణి వదిలేసి, రైతుని జైల్లో పెట్టి చితకబాదారు.



అంతా చూసి, "ఆహా.. చూసావా అమ్మోరు తల్లీ, నేనెంత మంచి పని చేసానో, న్యాయాన్ని బ్రతికించాను." అంది. దానికి అమ్మవారు, "తాయారు నిజానికి నువ్వు అన్యాయం చేసావు, ఎందుకంటే, ఆ దుర్మార్గుడైన రాజకీయ నాయకుడి పర్సు రైతుకి దొరకాలనే నేను అది కింద పడేలా చేశాను.. పాపం ఆ రైతు ఇప్పుడు ఇంకా కష్టాల్లో పడ్డాడు.." అంది. "అది నిజమే తల్లీ, కానీ, సైనికుడు ఏ తప్పు చేయలేదు కదా..మరి అతనికి న్యాయం చేశాను కదా.." అడిగింది తాయారు. అప్పుడా అమ్మ, "అతనికి ఆయు గండం ఉంది, దాన్ని తప్పించుకోవాలంటే మూడు రోజులు జైలులో ఉండేవాడు, కానీ, ఇప్పుడతని ప్రయాణంలో అతనికి మరణం తప్పదు.. " అంది. అయ్యో..! ఇంత పని చేసానా తల్లీ, "నన్ను క్షమించు.." అని చెప్పి, తెల్ల మొహం వేసింది తాయారు.


"దేవత సహనం ఒక కారణానికై ఉంటుంది, అలాగే ఒక మంచితనం కూడా... , అది ఓర్పుగా ఉంది అంటే, ఒక మంచి కోసమని అర్థం, అంతేకాని, చేతగాని తనం మాత్రం కాదు.. జరిగే ప్రతి ఘటనలోనూ, ఒక అంతర్ నటన ఉంటుంది.. అది అర్థం చేసుకున్న వారిని  కష్టం ఎప్పటికీ కష్టపెట్టలేదు.. !"  

Tuesday 28 January 2014

నమ్మకం



రాజారావు అనే ఒక వ్యాపారి దిగాలుగా సర్వం కోల్పోయి శూన్యాన్ని చూస్తూ కూర్చున్నాడు. సమయం గడుస్తూ ఉంది. అంతా శూన్యం, అంతా మౌనం. నాకు దిక్కెవరు? అని మనసు ఆవేదన పడుతూ ఉండగా, ఒక వయో వృద్ధుడు అతని పక్కన కూర్చుని, అతని పరిస్థితిని గమనించి ఏమైందో చెప్పమన్నాడు. అంతే, కట్టలు తెంచుకున్న దుఃఖంతో, "అంతా అయిపోయింది. ఎంతో ఘనంగా బ్రతికిన జీవితం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వ్యాపారంలో తీరని నష్టం, అప్పుల వాళ్ళ వెంబడింపులు, అయినవాళ్ళ ఈసడింపులు.. నిన్న గొప్పగా చూసిన ఆ మనుషులే నేడు పురుగులా తీసేస్తున్నారు. ఇంక దిక్కెవరు?" అంటూ భోరుమన్నాడు రాజారావు.

ఆ వృద్ధుడు ఎంతో ప్రేమగా అతని భుజం తట్టి, "నీ ఇబ్బందులు నాకు అర్థమయ్యాయి. ఆ దేవునిపై భారం వేసి నీకు ఈ ఆర్థిక సహయం చేస్తున్నాను, మళ్ళీ మొదలుపెట్టు, కానీ, వచ్చే యేడు ఇదే సమయానికి నాకు ఇదంతా తిరిగి ముట్టజెప్పాలి సుమా.." అని చెప్పి ఒక చెక్కు తీసి సంతకం చేసిచ్చాడు. ఆ చెక్కు ఐదు లక్షల డాలర్లు విలువైంది. ఆ సంతకం రాక్ ఫెల్లర్ ది. అంతా కోల్పోయాననుకుని కృంగిపోతున్న రాజారావులో విశ్వాసం ఉప్పొంగింది. ఏదైనా ఇక ఈ ఆలంబన నాకు ఉందనే ధైర్యం కొండంత ధైర్యాన్నిచ్చింది. చెక్కుని బీరువాలో భద్రంగా దాచుకున్నాడు. వ్యాపారాన్ని మళ్ళీ ప్రారంభించాడు. అతని గుండె నిబ్బరాన్ని చూసిన అప్పులవాళ్ళు కూడా అతణ్ణి ఒత్తిడి చేయలేకపోయారు. ఏదైనా జరిగితే, ఈ చెక్కు ఉంది కదా కాపాడుతుంది అని భద్రం చేసుకుని, ఆ చెక్కుని విడిపించే అవసరం లేకుండానే, తన స్వయం కృషితో వ్యాపారంలో అంతులేని లాభాల బాటను పరిచాడు. జీవితం ఆనందమయమైంది. ఆ పరిస్థితులు ఎవరేమిటో తెలుసుకునేలా చేసాయి. ఒక్క ఓటమి ఎన్నో పాఠాలు నేర్పింది. యేడాది గడిచింది. ఇక ఆ చెక్కుని తీసుకుని, వడ్డీ ని కలుపుకుని తిరిగి ఇద్దామని ఆ చోటికి వెళ్ళి ఎదురుచూస్తున్నాడు రాజారావు.

ఇంతలో అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తున్న ఆ వృద్ధుణ్ణి, ఒక నర్సు పట్టుకుంది. ఏమిటండీ ఆయన్ని అలా బలవంతం చేస్తున్నారు అనడిగాడు రాజారావు. "ఇతనికి తనకు తాను రాక్ ఫెల్లర్ ని అని చెప్పుకొవటం అలవాటు, ఈ పార్కులో ఉన్నోళ్ళందరికీ చెక్కులిచ్చి ఫూల్స్ చేస్తూ ఉంటాడు, పెద్ద మెంటల్ పేషెంట్. ఇదో రకమైన పిచ్చి" అని చెప్పి అతణ్ణి లాక్కుని అక్కణ్ణించి వెళ్ళిపోయింది.
దానికి ఆశ్చర్యపోయి, "పిచ్చివాడైతేనేం? నాలో మనో బలాన్ని పెంచిన మహనీయుడు, ఆయన బాధ్యత స్వీకరించి ఆయన రుణం తీర్చుకుంటాను" అనుకుని నమ్మకంతో అక్కణ్ణించి కదిలాడు రాజారావు. ఇకపై అంతా సఫలమే...

ఫ్రెండ్స్.., "మనిషికి గెలుపు ఓటమి సహజం. ఆపదలోనో బాధల్లోనో కూరుకుపోయిన వారికి కాస్తంత ప్రోత్సాహాన్ని నమ్మకాన్ని ఇచ్చినవారు నిజంగా దైవంతో సమానులే. గెలిచినపుడు చప్పట్లు కొట్టి ప్రోత్సహించటం ఎంత అవసరమో, ఓడినప్పుడు భుజం తట్టి ధైర్యాన్నివ్వటం అంతే అవసరం. అలాగే, సహాయం చేసినవారిని మరువకూడదు. చివరికి మనిషికి మనిషే కదా తోడు, మానవత్వమే కదా ఆలంబన. "

Friday 17 January 2014

పిల్లి

అనగనగా ఒక ఊర్లో ఒక పిల్లి ఉండేది. ఆ పిల్లి అన్నీ తుంటరి పనులు చేస్తూ దొంగ వేషాలేస్తూ అందరి చేతా దొంగ పిల్లి అని తిట్టించుకుంటూ ఉండేది. ఈ దొంగ పిల్లి వంకర బుద్ధిని కనిపెట్టి ఎవరూ రెండ్రోజుల కంటే ఎక్కువ దాని గురించి పట్టించుకునేవారు కాదు. దాంతో ఆ దొంగ పిల్లికి తిండి కూడా సరిగ్గా దొరక్క చాలా ఇబ్బంది అయిపోయేది. అయినా సరే, తన పద్ధతి ఏ మాత్రం మార్చుకోకుండా అలాగే చిన్న చిన్న మోసాలు చేసుకుంటూ, అందర్నీ విసిగిస్తూ, తిండిని దొంగతనం చేస్తూ, ఆ ఇల్లూ ఈ ఇల్లూ తిరుగుతూ బతికేస్తూ ఉండేది ఆ దొంగ పిల్లి.

ఒకసారి ఇలాగే ఒకరింట్లో తిట్లూ తన్నులూ తిన్నాక మళ్ళీ పొట్ట నింపుకోవడం కోసం మరో ఇల్లు వెతుక్కుంటూ ఒక కొత్త గడప దగ్గరికి వెళ్ళింది దొంగ పిల్లి.


ఆ ఇల్లు బుజ్జిగాడు వాళ్ళు ఉండే ఇల్లన్నమాట. బుజ్జిగాడికి ఓ ఏడాది వయసుంటుంది. గడపలో నుంచి లోపలికి తొంగి చూసిన దొంగ పిల్లికి లోపల ఇల్లంతా పాకేస్తూ బుడి బుడి అడుగులేస్తూ ఉన్న బుజ్జిగాడు కనిపించాడు. అక్కడ నుంచి దొంగ పిల్లి వంటింటి వైపు వెళ్ళింది. మరి తినడానికి ఏదన్నా దొరికేది అక్కడే కదా! అక్కడ వంట చేస్తున్న బుజ్జిగాడు వాళ్ళమ్మ పిల్లిని చూసీ చూడగానే చిరాకు పడిపోయి కర్రొకటి పుచ్చుకుని గట్టిగా అదిలించింది దూరంగా పొమ్మని.


దొంగ పిల్లికి అర్థమైపోయింది ఇంక ఈ ఇంట్లో తనకి తిండి దొరకడం కష్టమేనని. ఉసూరుమంటూ మళ్ళీ వీధి గుమ్మం వైపు వచ్చేసరికి లోపల నేల మీద కూర్చుని బొమ్మలతో ఆడుకుంటున్న బుజ్జిగాడు కనిపించాడు. అంతలోనే బుజ్జిగాడు వాళ్ళమ్మ ఒక పళ్ళెంలో బిస్కెట్లు తీసుకొచ్చి బుజ్జిగాడి పక్కన పెట్టి తింటూ ఆడుకోమని చెప్పి వాడికో ముద్దిచ్చి మళ్ళీ వంటింట్లో పని చేసుకోడానికి వెళ్ళిపోయింది. ఇంతలోనే బోల్డన్ని దొంగ బుద్ధులున్న మన దొంగ పిల్లికి ఒక దొంగ ఆలోచన వచ్చింది. అస్సలు చప్పుడు చెయ్యకుండా మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ బుజ్జిగాడి దగ్గరికి వెళ్ళి వాడి పక్కన పళ్ళెంలో ఉన్న బిస్కెట్లన్నీ నోట కరచుకుని గబా గబా ఇంట్లోంచి బయటికి పారిపోయింది.


ఇలాగే రోజూ వచ్చి బుజ్జిగాడి కోసం వాళ్ళమ్మ పెట్టిన బిస్కట్లన్నీ లాగేసుకుని తినేస్తూ ఉండేది దొంగ పిల్లి. అయినా సరే బుజ్జిగాడు అరవడం గానీ, ఏడవడం కానీ చేసేవాడు కాదు. ఆ పిల్లిని చూసినప్పుడల్లా నవ్వుతూ కేరింతలు కొట్టేవాడు.

ఇలా కొన్ని రోజులు గడిచాక ఒకసారి బుజ్జిగాడు వాళ్ళ కుటుంబం అంతా కలిసి ఇంటికి తాళం పెట్టి రెండ్రోజుల పాటు ఊరెళ్ళారు.
ఆ రెండ్రోజులూ దొంగ పిల్లికి ఎంత ప్రయత్నించినా ఎక్కడా తిండి దొరకలేదు. దాంతో చాలా నీరసపడిపోయిన దొంగ పిల్లి అన్ని చోట్లా తిరిగి తిరిగీ మళ్ళీ చివరికి బుజ్జిగాడి వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చేసరికి తలుపులు తెరిచి ఉన్నాయి. దాంతో బుజ్జిగాడి దగ్గర తిండి దొరుకుతుందన్న ఆశతో ప్రాణం లేచి వచ్చినట్టయింది దొంగ పిల్లికి. అయితే అప్పుడే బుజ్జిగాడు వాళ్ళమ్మ బిస్కెట్లు తీస్కొచ్చి బుజ్జిగాడికిచ్చి అక్కడే పక్కనే కూర్చుని పుస్తకం చదువుకుంటోంది. ఆవిడకి పిల్లులంటే అస్సలు ఇష్టం ఉండదు, చూస్తే కోప్పడుతుందని తెల్సిన దొంగ పిల్లి ఆవిడ ముందు బయట పడలేక, మరో పక్కేమో ఆకలికి తాళలేక గుమ్మం దగ్గర నక్కి అప్పుడప్పుడూ లోపలికి తొంగి చూస్తోంది.
కాసేపటికి ఇలా దాగుడు మూతలు ఆడుతున్న దొంగపిల్లి బుజ్జిగాడి కంట్లో పడింది. వాడు లేచి మెల్లగా బుడి బుడి అడుగులేసుకుంటూ గుమ్మం దగ్గరికొచ్చి తన చేతిలో ఉన్న బిస్కెట్ ని పిల్లి ముందు పడేసాడు. వెంటనే పిల్లి బిస్కెట్ అందుకుని తినేసింది. అప్పుడు బుజ్జిగాడు కూడా అక్కడే కూర్చుండిపోయి కిలకిలా నవ్వుతూ పిల్లి తల మీద చెయ్యి వేసి నిమిరాడు. అన్ని రోజుల నుంచీ తన బిస్కెట్లు అన్నీ ఎత్తుకుపోయినా సరే అందరిలాగా చీదరించుకోకపోగా అంత ప్రేమగా తన కోసం ఇప్పుడు బిస్కెట్ తెచ్చిచ్చిన బుజ్జిగాడిని చూసి పిల్లికి పశ్చాత్తాపం కలిగింది. ఇంతలో బుజ్జిగాడు వాళ్ళమ్మ గుమ్మం దగ్గరికి వచ్చేసరికి పిల్లికి భయమేసి పారిపోబోయింది. కానీ, ఎప్పటి లాగా ఆవిడ విసుక్కోలేదు. ఇద్దర్నీ చూసి నవ్వేసి ఇంకో నాలుగు బిస్కెట్లు తెచ్చి ఇచ్చింది.

వాళ్ళ ఆదరణ చూసి దొంగ పిల్లికి బుద్ధొచ్చింది.


ఎంతసేపూ నేను, నా తిండి, నా కోసం అని స్వార్ధంగా ఆలోచించుకుంటూ ఇలా అందరి చేతా తిట్లు తింటూ బతకడం ఎంత మూర్ఖత్వమో తెలిసొచ్చింది. ఏదైనా మన చుట్టూ ఉన్నవారితో స్నేహంగా ఉండటంలోనూ, మరొకరితో పంచుకోవడంలోనే ఎంతో సంతోషం, సంతృప్తి ఉన్నాయని అర్థమయ్యాక దొంగ పిల్లి కాస్తా మంచి పిల్లిలా మారిపోయింది. బుజ్జిగాడికి మంచి నేస్తం అయిపోయింది.. ఎంచక్కా వాళ్ళిద్దరూ కలిసి ఆడుకుంటూ సంతోషంగా ఉండిపోయారు.


మాన్డవిల్లి దుర్గ గారి  సహకారంతో